ఏపీ సర్కార్ కీలక నిర్ణయం – ఎల్పీజీ సిలిండర్ల స్థానంలో ఇక…!
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం – ఎల్పీజీ సిలిండర్ల స్థానంలో ఇక…!
ఇరాన్ యుద్ధ ప్రభావంతో ఏర్పడిన ఎల్పీజీ సంక్షోభం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో ఎల్పీజీ సరఫరా సమస్యను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగం పెంచాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఎల్పీజీ స్థానంలో పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG), అలాగే విద్యుత్ ఆధారిత పరికరాలు వినియోగాన్ని విస్తరించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి పీఎన్జీ కనెక్షన్లు అందించేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 2.34 లక్షల పీఎన్జీ కనెక్షన్లు అందుబాటులో ఉన్నప్పటికీ కేవలం 60 వేల మంది మాత్రమే వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కనెక్షన్లను 100 శాతం వినియోగించడమే కాకుండా ప్రతి జిల్లాలో కనీసం 10 వేల కొత్త కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టారు.
అలాగే శ్రీకాకుళం–కాకినాడ గ్యాస్ పైప్లైన్ పునరుద్ధరణపై కేంద్రానికి లేఖ రాయాలని సీఎం ఆదేశించారు. ఏపీ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ విస్తరణకు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. రాబోయే కేబినెట్ సమావేశంలో “కామర్షియల్ సెక్టార్లో నేచురల్ గ్యాస్ ప్రోత్సాహ విధానం” తీసుకురావాలని నిర్ణయించారు.
గ్యాస్ సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకొని ఇండక్షన్ స్టవ్లు, ఎలక్ట్రిక్ కుక్కర్లు వంటి పరికరాల వినియోగాన్ని ప్రోత్సహించాలని సీఎం పేర్కొన్నారు. విద్యాసంస్థలు, ఆస్పత్రులు, అంగన్వాడీలు, అన్న క్యాంటీన్లు, హోటళ్లకు ప్రాధాన్యత క్రమంలో ఎల్పీజీ సిలిండర్ల పంపిణీ జరగాలని ఆదేశించారు.
ఇదిలా ఉండగా, గత ఐదు రోజులుగా గృహ అవసరాల కోసం రోజుకు సగటున 1.80 లక్షల ఎల్పీజీ సిలిండర్లు పంపిణీ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 14,444 మెట్రిక్ టన్నుల గ్యాస్ నిల్వలు ఉన్నాయని తెలిపారు.