ఏపీకి వచ్చిన ఘరానా దొంగలు.. థార్ గ్యాంగ్ కదలికలపై పోలీసుల అలర్ట్
మధ్యప్రదేశ్ రాష్ట్రం ధార్ జిల్లాకు చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు సమాచారం నేపథ్యంలో ప్రకాశం, ఏలూరు జిల్లాల పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ముఠా కదలికలపై అనుమానాలు వ్యక్తమవుతుండటంతో కీలక ప్రాంతాల్లో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేశారు.
చీరాలలో గతంలో జరిగిన చోరీ కేసుల్లో నిందితులుగా ఉన్న స్థానిక ముఠాలతో ఈ గ్యాంగ్కు సంబంధాలు ఉండొచ్చన్న అనుమానంతో పోలీసులు స్థానిక నేరస్థుల కదలికలపై కూడా ప్రత్యేక నిఘా పెట్టారు. చీరాల టూ టౌన్ సీఐ శశికుమార్ అనుమానితుల ఫొటోలతో పోస్టర్లు విడుదల చేసి, వారి గురించి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
పర్చూరు ప్రాంతంలో కూడా పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ధార్ గ్యాంగ్ కదలికలపై రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తత కొనసాగుతోందని పర్చూరు ఎస్ఐ పులి గోపి తెలిపారు.
అలాగే ఏలూరు రైల్వే స్టేషన్ పరిసరాల్లో ముగ్గురు అనుమానితుల కదలికలు సీసీటీవీ కెమెరాల్లో నమోదైనట్లు సమాచారం. గ్రామాలు, పట్టణాల్లో అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు.
ప్రజల సహకారంతో ఈ ముఠా కదలికలను గుర్తించి నేరాలను అరికట్టేందుకు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు స్పష్టం చేశారు.