అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి నాదెండ్ల మనోహర్
అమరావతి: అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అగ్రిగోల్డ్ అంశంపై నిర్వహించిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం అనంతరం ఆయన కీలక నిర్ణయాలను వెల్లడించారు.
అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు న్యాయం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న మంత్రి, సంస్థకు చెందిన సుమారు 6 వేల ఎకరాల భూములను వేలానికి సిద్ధం చేసినట్లు తెలిపారు. వేలం ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని సీఐడీ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.
అగ్రిగోల్డ్ సంస్థ మొత్తం రూ.6 వేల కోట్ల డిపాజిట్లు సేకరించగా, అందులో ఆంధ్రప్రదేశ్ నుంచే రూ.3 వేల కోట్ల మేర డిపాజిట్లు సమీకరించినట్లు వెల్లడించారు. బాధితుల పూర్తి వివరాలను నమోదు చేసి పారదర్శకంగా అందుబాటులో ఉంచేందుకు ప్రత్యేక వెబ్సైట్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
బాధితులకు బాండ్లు అందజేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని, సెప్టెంబర్ 15లోగా బాండ్ల జారీ ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. అలాగే అగ్రిగోల్డ్ వ్యవహారంపై ఈ నెల 11న ప్రధాన కార్యదర్శితో కీలక సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు.
అగ్రిగోల్డ్ కేసుల విచారణ వేగవంతం చేసేందుకు ఆగస్టు 15లోగా ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు