ఐసీడీఎస్ కోడిగుడ్ల అక్రమ రవాణాపై మంత్రి పార్థసారధి ఆగ్రహం
ఏలూరు జిల్లా, నూజివీడు: డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో అందిన ఫిర్యాదు మేరకు నూజివీడు మండలం తుక్కులూరు గ్రామంలో ఐసీడీఎస్కు సరఫరా చేయాల్సిన కోడిగుడ్ల అక్రమ రవాణా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి దృష్టికి రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి తీసుకెళ్లారు.
ఫిర్యాదుపై స్పందించిన మంత్రి పార్థసారధి ఐసీడీఎస్ కోడిగుడ్ల అక్రమ రవాణాపై సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అక్రమాలకు పాల్పడిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు సంబంధిత కాంట్రాక్టును రద్దు చేసే అంశాన్ని పరిశీలించాలని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్కు సూచించారు.
పిల్లల పోషకాహారానికి ఉద్దేశించిన సరుకుల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం లేదా అక్రమాలను సహించబోమని మంత్రి స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.