అకాల వర్షాలతో మొక్కజొన్న పంట నష్టం
అకాల వర్షాలతో మొక్కజొన్న పంట నష్టం ఎకరాకు రూ.20 వేల పరిహారం ఇవ్వాలి: రైతు, కౌలు సంఘాలు
వత్సవాయి, మార్చి 20:
వత్సవాయి మండలంలోని పోలంపల్లి, పెంటలేవారిగూడెం, డబ్బకుపల్లి గ్రామాల్లో ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా మొక్కజొన్న పంట తీవ్రంగా దెబ్బతిన్నది. నేలకొరిగిన పంటలను రైతు, కౌలు రైతుల సంఘాల నాయకులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎం. చంద్రశేఖర్ మాట్లాడుతూ, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే ఎకరాకు రూ.20 వేల చొప్పున పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు.
రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో రైతు, కౌలు రైతు సంఘాల నాయకులు టి. రమేష్, కే. వెంకటేశ్వర్లు, జి. కృష్ణా, వై. వెంకటరత్నం, ఎ. మల్లికార్జునరావు, రైతులు కనకయ్య, గోపాలరావు, కె. శ్రీనివాసరావు, పి. జగన్నాధం, సీఐటీయూ నాయకుడు బి. రాము తదితరులు పాల్గొన్నారు.