అమరావతి శాశ్వత రాజధాని బిల్లు ఆమోదం – చాట్రాయిలో సంబరాలు
పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని సమర్థిస్తూ బిల్లు ఆమోదం పొందగా, ఈరోజు రాజ్యసభలో కూడా మూజివాణితో అదే బిల్లును ఆమోదించి రాష్ట్రపతికి సమర్పించే ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.
ఈ శుభసందర్భాన్ని పురస్కరించుకొని చాట్రాయి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో బళ్ళా రాజు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు పాల్గొని తమ ఆనందాన్ని పంచుకున్నారు.
ఆంధ్రప్రదేశ్కు అమరావతి శాశ్వత రాజధానిగా రూపుదిద్దుకోవడం రాష్ట్ర భవిష్యత్తుకు మేలు చేసే శుభపరిణామమని పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు. ఈ విజయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి మండలి సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యుల కృషి ఎంతో కీలకమని కొనియాడారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, అమరావతి అభివృద్ధి ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.