www.ntodaynews.com
తిరుమల లడ్డూ పవిత్రతపై దాడి
తెలంగాణ
తిరుమల లడ్డూ పవిత్రతపై దాడి
-కల్తీ నెయ్యి ఆరోపణలపై పుంగనూరులో భారీ నిరసన
NTODAY NEWS: అన్నమయ్య జిల్లా, పుంగనూరు ప్రతినిధి రాఘవేంద్ర రాజు
తిరుమల లడ్డూ అత్యంత పవిత్రమైన ప్రసాదమని, గత వైసీపీ పాలనలో కల్తీ నెయ్యి వాడటం ద్వారా భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ఆరోపిస్తూ పుంగనూరులో కూటమి నాయకులు భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. పుంగనూరు కోనేరు వద్ద నిర్వహించిన ఈ నిరసనలో వైసీపీ నాయకులకు వ్యతిరేకంగా ఫ్లెక్సీ కార్డులు, ప్లకార్డులు ప్రదర్శించారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ ఇంచార్జి చిన్న రాయల్ మాట్లాడుతూ, తిరుమల సన్నిధానంలో ఆవు పాలు లేకుండా నెయ్యి తయారు చేయడం అత్యంత దారుణమని విమర్శించారు. స్పెషల్ సిట్ అధికారులు సైతం నెయ్యిలో రసాయనాలు వాడినట్టు నివేదికలో పేర్కొన్నారని తెలిపారు. కోట్ల రూపాయలు దోచుకోవాలనే ఉద్దేశంతో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా మోసం చేశారని ఆరోపించారు.
కల్తీ నెయ్యి వ్యవహారానికి బాధ్యులైన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులు చేసిన ఈ చర్యను ప్రజలు, భక్తులు ఎప్పటికీ క్షమించరని అన్నారు. ప్రజలను మోసం చేసిన ఫలితంగానే ఆ పార్టీ ప్రస్తుతం పరిమిత సీట్లకే చేరిందని విమర్శలు చేశారు. హిందూ మనోభావాలను దెబ్బతీసేలా దేవుని అభిషేకానికి కల్తీ నెయ్యి వాడటం తీవ్రమైన నేరమని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ అంశంపై చేసిన వ్యాఖ్యలు ప్రజల ముందుకు రావడంతో నిజాలు వెలుగులోకి వచ్చాయని నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా నాయకులు రామాంజనేయులు, రాష్ట్ర ముదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ మణికంఠ, లీగల్ సెల్ సభ్యుడు సీవీ శ్రీనివాసులు, పట్టణ అధ్యక్షుడు గాజుల నరేష్, సోమల మండల అధ్యక్షుడు నాగభూషణ్, చౌడేపల్లి నాయకుడు హేమవంత్, పట్టణ నాయకులు భార్గవ్, అనిల్, వినోద్, రూరల్ నాయకులు రెడ్డి, గణ, ఏఎంసీ డైరెక్టర్ మురళి, కోలా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
#Ntodaynews #Punganur #AnnamayyaDistrict #TirumalaLaddu #AndhraPradeshPolitics #PublicProtest
Follow us on
Website
Facebook
Instagram
YouTube