అనాథ శతాధిక వృద్ధురాలికి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు
అనాథ శతాధిక వృద్ధురాలికి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు
జంగారెడ్డిగూడెం, జులై 22:
జంగారెడ్డిగూడెంలోని శ్రీ సీతామహాలక్ష్మి వృద్ధాశ్రమంలో నివసిస్తున్న శతాధిక వృద్ధురాలు కుచ్చలపాటి సూర్యకాంతమ్మ (108) మంగళవారం రాత్రి కన్నుమూశారు. కుటుంబ సభ్యులు స్పందించకపోవడంతో వృద్ధాశ్రమ నిర్వాహకుడు జయవరపు శేఖర్, కామవరపుకోట సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ వీరమల్ల మధు ఆధ్వర్యంలో స్థానిక హిందూ స్మశానవాటికలో శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అప్లాండ్ క్షత్రియ సేవా సమితి సభ్యుడు దండు ధనరాజు మాట్లాడుతూ, వృద్ధాశ్రమ నిర్వహణతో పాటు అనాథలు, అభాగ్యులకు సేవలందిస్తూ వారి అంత్యక్రియలను సైతం నిర్వహిస్తున్న శేఖర్, మధు సేవలు ఆదర్శనీయమని కొనియాడారు. కుటుంబ సభ్యులు ఆఖరి చూపుకు కూడా రాకపోవడం బాధాకరమని అన్నారు.
జయవరపు శేఖర్, వీరమల్ల మధు మాట్లాడుతూ వృద్ధులు, వికలాంగులు, నిరాశ్రయులకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు మనసుకు తృప్తినివ్వడమే కాకుండా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో చేకూరి శ్రీనివాసరాజు, కాలేజీ సత్యనారాయణరాజు, వేగేసిన రామరాజు, పొత్తూరి సుబ్బరాజు, కోలనువాడ శ్రీనివాసరాజు, పేరిచర్ల సత్యనారాయణరాజు, శ్రీనివాసరాజు, వీరమల్ల సౌజన్ తదితరులు పాల్గొన్నారు.