పెనుగొలనులో గణపతికి అంగన్వాడి చిన్నారుల గుంజీలు
చదువు బాగా రావాలని చిన్నారుల ప్రత్యేక ప్రార్థనలు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. శ్రీ రంగనాయక స్వామి ఆలయం వెనుక ఉన్న 99వ అంగన్వాడి కేంద్రం వద్ద గత 20 సంవత్సరాలుగా గణపతి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా యువకుల ఆధ్వర్యంలో ఈనెల 14న వినాయక చవితి సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పందిరిలో ప్రథమ పూజాధిపతి గణపతి స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రతి ఏడాది గణపతి విగ్రహం ఏర్పాటు చేసిన మందిరం వద్ద విద్యార్థులు, చిన్నారులు గణపతికి గుంజీలు తీయడం సంప్రదాయంగా కొనసాగుతోంది. ఉత్సవాల్లో భాగంగా బుధవారం మూడో రోజు ఆలయ అర్చకులు భాస్కరాచార్యులు గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం 99వ అంగన్వాడి కేంద్రానికి చెందిన చిన్నారులు ఉత్సాహంగా గణపతి ముందు గుంజీలు తీసి చదువులో మంచి ప్రతిభ కనబరచాలని ప్రార్థించారు. చిన్నారుల భక్తి, ఉత్సాహం అక్కడి వాతావరణాన్ని ఆధ్యాత్మికంగా మార్చింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు భాస్కరాచార్యులు గణపతికి గుంజీలు తీయడం వెనుక పురాణాల్లో ఆసక్తికరమైన కథ ఉందని వివరించారు. ఒకసారి శ్రీమహావిష్ణువు తన బావగారైన పరమేశ్వరుడిని కలిసేందుకు కైలాసానికి వెళ్లారని తెలిపారు. ఆ సమయంలో ఆయన తన పరమ పవిత్రమైన, శక్తివంతమైన ఆయుధమైన సుదర్శన చక్రాన్ని పక్కన ఉంచారని చెప్పారు. అక్కడ ఆడుకుంటున్న బాల గణపతికి సుదర్శన చక్రం మెరుస్తూ వింతగా కనిపించడంతో దానిని తీపి వస్తువుగా భావించి నోట్లో వేసుకుని మింగేశాడని పురాణ కథను వివరించారు. సుదర్శన చక్రం కనిపించకపోవడంతో విష్ణుమూర్తి దివ్యదృష్టితో అది గణపతి పొట్టలో ఉన్నట్లు తెలుసుకున్నారని తెలిపారు. అనంతరం ఉపాయంతో గణపతి ముందు నిలబడి కుడి చేతితో ఎడమ చెవి, ఎడమ చేతితో కుడి చెవి పట్టుకుని గుంజీలు తీయడం ప్రారంభించారని చెప్పారు. విష్ణుమూర్తి గుంజీలు తీయడాన్ని చూసిన బాల గణపతికి విపరీతమైన నవ్వు వచ్చిందని, పెద్దగా నవ్వడంతో ఆయన నోటి నుంచి సుదర్శన చక్రం బయటకు వచ్చిందని వివరించారు. దీంతో విష్ణుమూర్తి తన ఆయుధాన్ని తిరిగి తీసుకున్నారని తెలిపారు. అప్పటి నుంచి గణపతికి ఇష్టమైన ఈ భంగిమ పూజా విధానంలో భాగంగా మారిందని భక్తుల విశ్వాసమని అర్చకులు తెలిపారు. గణపతి ముందు భక్తిశ్రద్ధలతో గుంజీలు తీస్తే ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారని వివరించారు.