అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
NTODAY NEWS చిట్యాల :- వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీరక, పంట దిగుబడి సరిగ్గా రాకపోవడంతో మనస్తాపానికి గురై ఒక రైతు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చిట్యాల ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం వనిపాకల గ్రామానికి చెందిన శిరసనగండ్ల వెంకన్న (57) అనే రైతు వ్యవసాయ అవసరాల నిమిత్తం తన ఇంటిపై ఫైవ్ స్టార్ ఫైనాన్స’లో సుమారు 5 లక్షల రూపాయల వరకు అలాగే తనకు తెలిసిన వారి వద్ద మరో 3 లక్షల రూపాయల వరకు అప్పులు చేశాడు. అయితే, ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రాకపోవడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక వెంకన్న తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యాడు అని తెలిపారు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన ఆయన, ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులందరూ పడుకున్న తర్వాత తన ఇంట్లోని రేకుల గదిలో ఉన్న ఇనుప రాడుకు తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. మృతునికి భార్య సైదమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుని భార్య సిరిసినగండ్ల సైదమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చిట్యాల సబ్ ఇన్స్పెక్టర్ మామిడి రవికుమార్ తెలిపారు...