అవినీతి అధికారి మాస్టర్ ప్లాన్.. గోడల్లో డబ్బు, దేవుడి ఫోటోల వెనుక బంగారం
ఉత్తరప్రదేశ్లో రవాణా శాఖ అధికారిగా పనిచేసిన లలిత్ కుమార్కు చెందిన ఆస్తులపై అవినీతి నిరోధక సంస్థ అధికారులు నిర్వహించిన సోదాల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నెలకు సుమారు రూ.80 వేల జీతం పొందే ఈ అధికారి వద్ద రూ.300 కోట్లకు పైగా విలువైన ఆస్తులు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం.
సోదాల సందర్భంగా ఇంట్లోని గోడల మధ్య ప్రత్యేకంగా ఖాళీలు ఏర్పాటు చేసి ప్లాస్టిక్ డబ్బాల్లో నగదు కట్టలను దాచినట్లు అధికారులు గుర్తించారు. ఇంట్లోని సోఫాలను ప్రత్యేకంగా తయారు చేయించి వాటి లోపల ఇనుప పెట్టెల్లో నగదు నిల్వ చేసినట్లు వెల్లడైంది. ప్రతి గదిలో ఏర్పాటు చేసిన ఫాల్ సీలింగ్పై ప్లాస్టిక్ కవర్లలో భారీ మొత్తంలో నగదు దాచినట్లు గుర్తించారు.
అంతేకాకుండా, పూజా గదిలో దేవుడి చిత్రాల వెనుక బంగారం బిస్కెట్లు, నగలు దాచినట్లు అధికారులు గుర్తించారు. ఇంట్లోని పలు రహస్య ప్రదేశాల నుంచి భారీ మొత్తంలో నగదు, బంగారం, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ఈ సోదాల్లో బయటపడిన నగదు, బంగారం దాచిన విధానం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అధికారులు స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ, వాటి మూలాలపై విచారణ కొనసాగుతోంది.