బాల్క సుమన్పై దేశద్రోహం ఫిర్యాదు: రాజకీయ నిషేధం విధించాలని రామిళ్ల రాధిక డిమాండ్
యువతను మిలిటెంట్లుగా మారమని ప్రేరేపిస్తున్నారని ఆరోపణ
యువత మిలిటెంట్లు కావాలని పిలుపునిచ్చిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బల్కా సుమన్పై రాజకీయ నిషేధం విధించి, ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలని కాంగ్రెస్ రాష్ట్ర జాయింట్ కన్వీనర్ రామిళ్ల రాధిక డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం 9:10 గంటల ప్రాంతంలో ఆమె హైదరాబాద్లోని మల్కాజిగిరి పోలీస్ స్టేషన్లో బల్కా సుమన్పై అధికారికంగా ఫిర్యాదు చేసి, అక్నాలెడ్జ్మెంట్ తీసుకున్నారు. యువతను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన సుమన్ ఒక దేశద్రోహి అని ఆమె మండిపడ్డారు. గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ప్రజాస్వామ్య నిరసనలను అణచివేసి, అక్రమ కేసులు పెట్టించారని, చివరకు బెల్ట్ షాపులపై పోరాడిన మహిళలను కూడా రిమాండ్కు పంపించారని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ప్రస్తుతం బల్కా సుమన్ తన స్వలాభం కోసం, తన పార్టీ అగ్ర నాయకత్వాన్ని మెప్పించడం కోసమే యువతను దేశద్రోహ చర్యల వైపు తప్పుదోవ పట్టిస్తున్నారని రామిళ్ల రాధిక ఆరోపించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి, చట్టాన్ని గౌరవించాల్సిన వ్యక్తి ఇలా మిలిటెంట్లుగా మారమని ప్రేరేపించడం సమాజ శాంతిభద్రతలకు తీవ్ర విఘాతమని పేర్కొన్నారు. ప్రజల జీవితాలతో ఆడుకుంటూ, దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తున్న ఆయన ప్రజా జీవితంలో కొనసాగేందుకు అర్హుడు కాదన్నారు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం మరియు పోలీస్ యంత్రాంగం బల్కా సుమన్పై తక్షణమే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె గట్టిగా డిమాండ్ చేశారు