బెల్లంపల్లిలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య
అధికారులతో కలిసి పలు అభివృద్ధి పనుల పరిశీలన
బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి, కమిషనర్ రమేష్, తహసిల్దార్ కృష్ణలతో కలిసి పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. అమృత్ 2.0 పనులలో వేగం పెంచాలని, అధికారులు, కాంట్రాక్టర్లు సమన్వయంతో పనిచేసి పెండింగ్ అంశాలను వెంటనే పరిష్కరించాలని ఆయన స్పష్టం చేశారు.
పట్టణ పరిశుభ్రతను మెరుగుపర్చేందుకు ప్రతిపాదిత నూతన డంపింగ్ యార్డ్ స్థలాన్ని పరిశీలించి, ఆధునిక ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను అభివృద్ధి చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్, పాత డంపింగ్ యార్డ్ భూ సమస్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే, మార్కెట్ యార్డ్లోని ఆక్రమణలను చట్టపరమైన చర్యల ద్వారా తొలగించి ప్రజా అవసరాల స్థలాలను విముక్తం చేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిని సమీక్షిస్తూ, మంజూరైన బిల్లుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
ఇదే పర్యటనలో బెల్లంపల్లి ఈఆర్ఓ (ERO) హోదాలో తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 'ఎన్నికల హెల్ప్ డెస్క్'ను అదనపు కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం ఎన్నికల పర్యవేక్షకులతో సమీక్ష సమావేశం నిర్వహించి.. ఓటరు జాబితాల నిర్వహణ, దరఖాస్తుల పరిష్కారంలో పూర్తి పారదర్శకత పాటించాలన్నారు. ప్రజలకు ఎన్నికల సేవలు సులభంగా అందించడంలో ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజినీరింగ్ సిబ్బంది, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు