బెల్లంపల్లిలో విద్యాసంస్థల నిర్మాణ పనుల తనిఖీ: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
పట్టణ ప్రాథమిక పాఠశాల, కస్తూరిబా విద్యాలయం పనుల పరిశీలన
సమగ్ర వసతి గృహ పాఠశాల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని సూచన
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్థల నిర్మాణాభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులకు చెప్పారు. మంగళవారం ఆయన బెల్లంపల్లి పట్టణంలోని రాంనగర్ ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న పట్టణ ప్రాథమిక పాఠశాల నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పనులను త్వరగా పూర్తి చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని అక్కడి అధికారులకు తెలిపారు. అనంతరం బెల్లంపల్లి మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి, అక్కడ నిర్మాణంలో ఉన్న భోజనశాల పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే నియోజకవర్గానికి ఒకటి చొప్పున మంజూరైన సమగ్ర వసతి గృహ పాఠశాల లో భాగంగా బెల్లంపల్లిలో చేపట్టిన పాఠశాల నిర్మాణ పనులను ఆయన నిశితంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ అనేక నూతన కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో సకల సదుపాయాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అల్పాహారం, మధ్యాహ్న భోజనం పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పాఠశాలల నిర్మాణ పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు