బిర్యానీ ధర రూ.10 తగ్గింపు విషయంలో ఘర్షణ.. రెస్టారెంట్పై దాడి
బిర్యానీ ధర రూ.10 తగ్గింపు విషయంలో ఘర్షణ.. రెస్టారెంట్పై దాడి
- నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లిలో ఘటన.. ముగ్గురికి తీవ్ర గాయాలు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి గ్రామంలో బిర్యానీ ధర విషయంలో జరిగిన చిన్న వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఎస్ఎస్ రెస్టారెంట్పై పోతవరప్పాడు గ్రామానికి చెందిన కొందరు యువకులు దాడి చేసిన ఘటన కలకలం రేపింది.
బాధితుల వివరాల ప్రకారం.. పోతవరప్పాడు గ్రామానికి చెందిన సుమారు 15 నుంచి 30 మంది యువకులు మద్యం మత్తులో రెస్టారెంట్కు వచ్చి బిర్యానీ కొనుగోలు చేశారు. బిల్లు విషయంలో రూ.10 తగ్గించాలని కోరడంతో హోటల్ యజమాని, కొనుగోలుదారుల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయిన యువకులు కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చి రెస్టారెంట్లోని ఫర్నిచర్ను ధ్వంసం చేసి దాడికి పాల్పడ్డారని బాధితులు తెలిపారు.
ఈ దాడిలో రెస్టారెంట్ యజమాని తుల్లిమిల్లి శ్రీనివాసరావు, ఆయన కుమారుడు తుల్లిమిల్లి రాజేష్తో పాటు ఒడిశాకు చెందిన హోటల్ కార్మికుడు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ముగ్గురిని నూజివీడు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. కర్రలు, రాళ్లు, బీరు సీసాలతో దాడి చేసినట్లు బాధితులు ఆరోపించారు. తమపై మూకుమ్మడిగా దాడి చేసి హోటల్ సామగ్రిని ధ్వంసం చేశారని వారు వాపోయారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దాడికి పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.