బండి సంజయ్ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి
బండి సంజయ్ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి: కేటీఆర్
హైదరాబాద్, మే 17: పోక్సో చట్టం కింద బండి భగీరథ్ అరెస్ట్ అయిన నేపథ్యంలో ఈ కేసు నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆదివారం ఎల్బీనగర్లో నిర్వహించిన ‘నా బూత్.. నా భవిష్యత్తు’ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. ప్రధాని మోదీ ‘బేటీ బచావో.. బేటీ పడావో’ అంటూ నినాదాలు ఇస్తున్నారని, అవి కేవలం నినాదాలకే పరిమితమైతే న్యాయం జరగదని అన్నారు.
భారతదేశంలో తొలిసారిగా ఓ కేంద్ర మంత్రికుమారుడిపై లుకౌట్ నోటీస్ జారీ చేసే పరిస్థితి వచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు. బండి సంజయ్ను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించకపోతే కేసు విచారణ సజావుగా సాగదని ఆందోళన వ్యక్తం చేశారు. తప్పు చేసిన కొడుకుని తొమ్మిది రోజుల పాటు దాచిపెట్టారని ఆరోపిస్తూ బండి సంజయ్పై విమర్శలు గుప్పించారు. ఇలాంటి వ్యక్తి పదవిలో కొనసాగడం తెలంగాణకే కాకుండా దేశానికే అవమానకరమని అన్నారు.
మైనర్ బాలికకు అన్యాయం జరిగిందని, ఆమె తల్లిదండ్రులను స్వయానా కేంద్ర మంత్రి భయభ్రాంతులకు గురిచేశారని కేటీఆర్ ఆరోపించారు. ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారని విమర్శించారు. హనీ ట్రాప్ పేరుతో మీడియాను మనీ ట్రాప్లోకి నెట్టారని, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కలిసి వార్తలు బయటకు రానీయకుండా చేశారని మండిపడ్డారు.
బండి సంజయ్ను వెంటనే కేంద్రమంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసిన కేటీఆర్, అలా చేయకపోతే బాధిత మహిళలు ముందుకు వచ్చి ఫిర్యాదు చేసే ధైర్యం కోల్పోతారని అన్నారు. అందుకే కేసు విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే బండి సంజయ్ను పదవి నుంచి తప్పించాలని కేంద్రానికి స్పష్టం చేశారు.
కేంద్రమంత్రి నుంచి ఎన్ని బెదిరింపులు, ఒత్తిళ్లు వచ్చినా బాధిత బాలిక తల్లి ధైర్యంగా నిలబడిందని కేటీఆర్ చెప్పారు. ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి కలిసి ఆ కుటుంబానికి అన్యాయం చేయాలనుకున్నా వారు వెనక్కి తగ్గలేదన్నారు. బాధిత బాలిక తరఫున పోరాడిన బీఆర్ఎస్ మహిళా విభాగానికి కేటీఆర్ అభినందనలు తెలిపారు. అలాగే బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ కూడా ఈ కేసులో గట్టిగా పోరాడారని గుర్తుచేశారు. బండి భగీరథ్ లొంగిపోయాడని, అరెస్టయ్యాడని చెబుతూ డ్రామా నడుస్తోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.