పాఠశాల ముందు చెత్త కుప్పలు... కాంగ్రెస్ పాలనపై బీజేపీ మండిపాటు
సత్తుపల్లి నియోజకవర్గ రిపోర్టర్ బూబత్తుల చెన్నా రావు
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ 8, 9వ వార్డుల్లో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను భారతీయ జనతా పార్టీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులతో మాట్లాడిన వారు, పాఠశాల ముందు పేరుకుపోయిన చెత్త, డ్రైనేజీల్లో నిల్వ ఉన్న మురుగు నీరు, కలుపు మొక్కల కారణంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
పిల్లలు చదువుకునే పాఠశాల ముందు కూడా పరిశుభ్రతను కాపాడలేని కాంగ్రెస్ పాలకులకు ప్రజల ఆరోగ్యంపై బాధ్యత లేదా అని బీజేపీ నాయకులు ప్రశ్నించారు. దోమలు, ఈగలు విపరీతంగా పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నప్పటికీ మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలు పన్నులు చెల్లిస్తున్నప్పటికీ కనీస పారిశుద్ధ్య సేవలు కూడా అందడం లేదని విమర్శించారు. వెంటనే పాఠశాల ముందు ఉన్న చెత్తను తొలగించి, డ్రైనేజీలను శుభ్రం చేయాలని, కలుపు మొక్కలను తొలగించి ఫాగింగ్ నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ను డిమాండ్ చేశారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు శాశ్వత చర్యలు చేపట్టాలని కోరారు.
ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే భారతీయ జనతా పార్టీ ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సత్తుపల్లి టౌన్ అధ్యక్షుడు బానోత్ విజయ్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు షేక్ రహ్మతుల్లా, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.