ప్రభుత్వ ఉద్యోగి అవినీతి.. రాజ్య వ్యతిరేక నేరమే: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగులు చేసే అవినీతి చర్యలను రాజ్యానికి, సమాజానికి వ్యతిరేకంగా చేసిన నేరాలుగానే పరిగణించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. డబ్బులు తీసుకుని ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన కేసులో నిందితులతో బాధితులు రాజీ కుదుర్చుకున్నారనే కారణంతో కేసును కొట్టివేసిన మద్రాసు హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తప్పుపట్టింది.
ఈ కేసును విచారించిన ద్విసభ్య ధర్మాసనం, హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేస్తూ నిందితులపై క్రిమినల్ ఫిర్యాదును తిరిగి పునరుద్ధరించాలని ఆదేశించింది.
ప్రభుత్వ ఉద్యోగాలను డబ్బులతో కొనుగోలు చేసిన వ్యక్తులు, ఆ మొత్తాన్ని తిరిగి సంపాదించుకునేందుకు అవినీతికి పాల్పడే అవకాశం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. దీంతో ప్రజలే పరోక్ష బాధితులవుతారని, అందువల్ల ఇలాంటి కేసుల్లో నిందితులను ఉపేక్షించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
అవినీతి ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసే తీవ్రమైన నేరమని, రాజీ పేరుతో ఇలాంటి కేసులను మూసివేయడం సమంజసం కాదని ధర్మాసనం పేర్కొంది.