మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: ఏఐటీయూసీ
సత్తుపల్లి నియోజకవర్గ రిపోర్టర్ బూబత్తుల చెన్నా రావు
ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచాలని డిమాండ్
డీఈఓకు వినతిపత్రం అందజేసిన మధ్యాహ్న భోజన కార్మికులు
ఖమ్మం: రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారులకు కార్మికుల సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని బుధవారం అందజేశారు. జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా ఇన్ఛార్జి డీఈఓ సదానందంకు ఈ వినతిపత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యుడు నిమ్మటూరి రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మధ్యాహ్న భోజన కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం గత ఏడాది పెంచిన మెస్ చార్జీలనే కొనసాగిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
వంటకు అవసరమైన బియ్యం, కూరగాయలు, వంటగ్యాస్ తదితర సరుకులను ప్రభుత్వమే నేరుగా సరఫరా చేయాలని, ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలను తక్షణమే పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే మధ్యాహ్న భోజన పథకం వంట కార్మికులను కార్మికులుగా అధికారికంగా గుర్తించి గుర్తింపు కార్డులు జారీ చేయాలని కోరారు.
కార్మికులను కనీస వేతనాల పరిధిలోకి తీసుకురావడంతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్, బీమా వంటి సంక్షేమ సౌకర్యాలు కల్పించి వారికి సామాజిక భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు తాళ్లూరు లక్ష్మి, ఉపాధ్యక్షురాలు షేక్ రహీమున్నీసా, జిల్లా కమిటీ సభ్యులు వెంకటమ్మ, సాయమ్మ, సత్యవతి, మంగమ్మ, పారేపల్లి సత్యవతి, లక్ష్మి, తులసి తదితరులు పాల్గొన్నారు.