కేంద్రం సంచలన నిర్ణయం.. త్వరలో కొత్త ‘గోల్డ్ మానిటైజేషన్’ పాలసీ..!
దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేయడానికి సిద్ధమవుతోంది. త్వరలో కొత్త ‘గోల్డ్ మానిటైజేషన్ పాలసీ’ని తీసుకురానున్నట్లు సమాచారం. ప్రజల ఇళ్లలో నిల్వగా ఉన్న బంగారాన్ని బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావడమే ఈ పథకం ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది. ముఖ్యంగా కేవలం 10 గ్రాముల బంగారం ఉన్నా బ్యాంకులో డిపాజిట్ చేసే అవకాశం కల్పించేలా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
భారతీయుల వద్ద సుమారు 30 వేల టన్నుల బంగారం నిల్వగా ఉందని అంచనా. అయితే ఈ బంగారం ఎక్కువ భాగం ఇళ్లలోనే ఉండిపోవడంతో దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రత్యక్షంగా ఉపయోగపడటం లేదు. మరోవైపు దేశ అవసరాల కోసం ప్రతి ఏడాది భారీ స్థాయిలో బంగారం దిగుమతులు చేయాల్సి వస్తోంది. దీని ప్రభావం విదేశీ మారక నిల్వలపై పడటంతో పాటు రూపాయి విలువపై కూడా ఒత్తిడి పెరుగుతోంది.
ఈ నేపథ్యంలో కొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీ ద్వారా ప్రజలు తమ వద్ద ఉన్న బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే దానిపై వడ్డీ పొందే అవకాశం కల్పించనున్నారు. అంతేకాకుండా పన్ను మినహాయింపులు కూడా ఇవ్వాలని కేంద్రం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇంట్లో ఖాళీగా ఉన్న బంగారం ద్వారా సామాన్యులకు అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంటుంది.
ఇక బ్యాంకుల్లో జమయ్యే బంగారాన్ని జువెలర్లకు అందించే విధానాన్ని కూడా అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని వల్ల దేశీయ ఆభరణాల తయారీ రంగానికి ఊతం లభించనుంది. ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం కనీసం 2 వేల టన్నుల బంగారం బ్యాంకింగ్ వ్యవస్థలోకి వస్తే వచ్చే మూడేళ్ల పాటు బంగారం దిగుమతుల అవసరం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
బంగారం దిగుమతులు తగ్గితే రూపాయి విలువ బలోపేతం కావడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా పెద్ద మేలు జరుగుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీంతో కేంద్రం తీసుకురానున్న కొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.