రైతులకు భరోసా కల్పించడమే సుపరిపాలన ప్రధమ కర్తవ్యం
బూరుగుగూడెం లో టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు రామరాజు ఆధ్వర్యంలో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన మంత్రి కొలుసు పార్థసారథి
రైతన్నలకు భూములకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలు - రక్షణ కవచంలా
భూరికార్డులు మార్పులకు తావులేకుండా ఆధునిక పరిజ్ఞానంతో డిజిటలైజేషన్ పద్ధతిలో పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ.
రైతులు, ప్రజలు హక్కులను గౌరవిస్తూ, వారికి భరోసా కల్పించడమే సుపరిపాలన ప్రధమ కర్తవ్యం.
రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి
ఏలూరు/చాట్రాయి, ఏప్రిల్ 08: చాట్రాయి మండలంలోని బూరుగుగూడెం గ్రామంలో బుధవారం రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార, పౌరసంబంధాల మంత్రి కొలుసు పార్థసారథి గారు ముఖ్య అతిథిగా పాల్గొని, 492 మంది రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. మిగిలిన 272 పాసుపుస్తకాలను త్వరితగతిన పంపిణీ చేసే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైతులకు భూహక్కులు పరిరక్షణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని, అందుకు అనుగుణంగా సర్వేపూర్తి అయిన ప్రతి రైతుకు పట్టాదారు పాసుపుస్తకాలు అందిస్తున్నామని తెలిపారు. రైతులు, ప్రజలు తమ హక్కులను గౌరవించి, వారికి భరోసా కల్పించడం సుపరిపాలన యొక్క ప్రధమ లక్ష్యమని మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు.
డిజిటలైజేషన్ పద్ధతి:
భూరికార్డులను మార్పు చేసేందుకు వీలులేకుండా ఆధునిక పరిజ్ఞానంతో డిజిటలైజేషన్ పద్ధతిలో పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేస్తున్నామని, వాటిలో అన్ని వివరాలు స్పష్టంగా ఉండాలని, తప్పులు ఉంటే వెంటనే సరిచేసి గ్రామ సభల్లో వాటిని అందజేస్తామని చెప్పారు.
పట్టాదారు పాసుపుస్తకాల క్యూఆర్ కోడ్:
ఈ పాసుపుస్తకాలలో ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే, రైతుల వివరాలు, భూమి వివరాలు, విస్తీర్ణం, స్కెచ్, రూటు మ్యాప్, శాటిలైట్ ఇమేజి కూడా చూడవచ్చని మంత్రి చెప్పారు.
రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక చర్యగా, భూములపై రైతుల హక్కులను పరిరక్షించే విధంగా ఉంటుంది. ప్రస్తుత ప్రభుత్వం గతంలో జరిగిన తప్పులను సరిచేసి, భద్రత కల్పిస్తూ రైతులకు పూర్తి హక్కులు అందిస్తున్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి గారు తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో, రైతులకు ఎలాంటి తప్పులు లేకుండా పట్టాదారు పాసుపుస్తకాలు అందించడం లక్ష్యంగా, జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది.
సమస్యల పరిష్కారం: రైతుల హక్కులు పరిరక్షించడం, భూములపై పూర్తి హక్కులు కల్పించడం, డిజిటల్ సిస్టమ్ ద్వారా సర్వేపూర్తి చేయడం అన్నీ గట్టి చర్యలు తీసుకోవడమే, ప్రభుత్వ లక్ష్యం.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, రైతులు మరియు ప్రజలు కూడా పాల్గొన్నారు.