బస్ భవన్ ముట్టడితో ఉద్రిక్తత.. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని తీన్మార్ మల్లన్న డిమాండ్
హైదరాబాద్ | ఆగస్టు 4 | NTODAY NEWS
హైదరాబాద్లోని బస్ భవన్ వద్ద మంగళవారం టీజీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. రిటైర్డ్ ఉద్యోగులకు మద్దతుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బస్ భవన్కు చేరుకోగా, పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. అనంతరం మల్లన్నతో పాటు ఐదుగురు రిటైర్డ్ ఉద్యోగుల ప్రతినిధులకు మాత్రమే అధికారులను కలిసేందుకు అనుమతి ఇచ్చారు.
ఆర్టీసీ అధికారులతో జరిగిన సమావేశంలో రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై మల్లన్న చర్చించారు. 2013, 2017, 2021 వేతన సవరణ బకాయిలు, PF, EPS-95, PF కాంట్రిబ్యూషన్, డీఏతో పాటు ఇతర పదవీ విరమణ ప్రయోజనాలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను సంవత్సరాలుగా పెండింగ్లో ఉంచడం అన్యాయమని మల్లన్న విమర్శించారు. ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని కోరారు.
అలాగే, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలపై స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
వారం రోజుల్లో రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బెనిఫిట్స్ విడుదల చేయాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, అవసరమైతే అసెంబ్లీ ముట్టడికి కూడా వెనుకాడబోమని తీన్మార్ మల్లన్న హెచ్చరించారు.
ఆర్టీసీ ఎన్నికల విషయాన్ని ప్రస్తావిస్తూ, కార్మికుల మద్దతుతో ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బహుజన్ వర్కర్స్ యూనియన్ చైర్మన్ సంపత్ ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ సాజిద్, గ్రేటర్ హైదరాబాద్ జోన్ గౌరవ అధ్యక్షుడు టీవీఆర్, తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజక్క, సహాయ కార్యదర్శి గిరిగాని బిక్షపతి గౌడ్తో పాటు పెద్ద సంఖ్యలో రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.