బ్యాంకుల్ని దోచుకున్న వారికి సౌకర్యాలు – సామాన్యులకు కఠిన నిబంధనలు!
బ్యాంకుల్ని దోచుకున్న వారికి సౌకర్యాలు – సామాన్యులకు కఠిన నిబంధనలు!
ఒడిశాలో జరిగిన రీతు ముండా ఘటన గ్రామీణ బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న లోపాలను బహిర్గతం చేసిందని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి. హరినాథ్ తెలిపారు. వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోడీ లాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోకుండా, వారి ఆస్తులు సీజ్ చేయకుండా ఉండగా సామాన్యులపై మాత్రం బ్యాంకులు నిబంధనల పేరుతో ఒత్తిడి తెస్తున్నాయని ఆయన విమర్శించారు.
ఒడిశా రాష్ట్రంలోని కియోంజర్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ హృదయ విదారక ఘటనలో జితు ముండా అనే గిరిజనుడు తన సోదరి మరణానంతరం ఆమె ఖాతాలో ఉన్న ₹19,300 తీసుకునేందుకు బ్యాంకును ఆశ్రయించాడు. కానీ డెత్ సర్టిఫికేట్ వంటి పత్రాలు లేకపోవడంతో అధికారులు డబ్బులు ఇవ్వడానికి నిరాకరించారు.
నిరక్షరాస్యుడైన జితు ముండా తీవ్ర నిరాశతో తన సోదరి సమాధి నుండి అస్థిపంజరాన్ని తవ్వి తీసుకుని బ్యాంకుకు తీసుకువచ్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం అస్థిపంజరాన్ని గౌరవప్రదంగా తిరిగి సమాధి చేయించారు.
ఈ ఘటనపై జిల్లా అధికారులు దర్యాప్తు ప్రారంభించి, బాధితుడికి అవసరమైన పత్రాలు అందించి బ్యాంక్ నుంచి డబ్బులు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలు ఇప్పటికీ అందుబాటులో లేవని, అట్టడుగు వర్గాలకు నిబంధనలు అడ్డంకిగా మారుతున్నాయని ఈ ఘటన స్పష్టం చేస్తోందని హరినాథ్ పేర్కొన్నారు. ఖాతాదారులను ఇబ్బందులకు గురిచేసే కఠిన నిబంధనలను సవరించాలని ఆయన డిమాండ్ చేశారు.