భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు లేక నర్సు కాన్పు చేయగా తల్లి–బిడ్డ మృతి
తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం శంభూనిగూడెం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. వనజ (20) అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను గుండాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో విధి నిర్వహణలో ఉన్న నర్సు సాధారణ కాన్పు చేసింది. కాన్పు అనంతరం శిశువు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వెంటనే ఇల్లెందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ వైద్యులు శిశువు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
ఇక కాన్పు తర్వాత తల్లికి తీవ్ర రక్తస్రావం కావడంతో పరిస్థితి విషమించింది. వెంటనే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ వనజ మృతి చెందింది.
ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే తమ కుటుంబాన్ని శాశ్వత విషాదంలోకి నెట్టిందని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని గ్రామస్థులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.