భగత్ సింగ్ నేటి యువతకు ఆదర్శం
భగత్ సింగ్ నేటి యువతకు ఆదర్శం: ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ తొర్లపాటి రాజు
చింతలపూడి, మార్చి 23: బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన అమరవీరుడు భగత్ సింగ్ నేటి యువతకు ఆదర్శప్రాయుడని ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ తొర్లపాటి రాజు అన్నారు. అలాగే నేటి యువత అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా గళం విప్పాలని పిలుపునిచ్చారు.
సర్దార్ భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా అఖిల భారత యువజన సమైక్య (ఏఐవైఎఫ్) ఆధ్వర్యంలో చింతలపూడి సిపిఐ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తొర్లపాటి రాజు మాట్లాడుతూ, భగత్ సింగ్ పంజాబ్ రాష్ట్రంలోని బంగా గ్రామంలో కిషన్ సింగ్, విద్యావతి దంపతులకు జన్మించి చిన్ననాటి నుంచే విప్లవ భావాలు అలవరుచుకున్నాడని తెలిపారు.
దేశభక్తిని తన జీవిత లక్ష్యంగా తీసుకున్న భగత్ సింగ్ యువతను చైతన్యవంతం చేసి, దేశానికి యువతే భవిష్యత్తు అని నమ్మిన మహనీయుడని అన్నారు. యువత నిస్సహాయంగా మారితే దేశ అభివృద్ధి దెబ్బతింటుందని భావించి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశాడని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి తొర్లపాటి బాబు మాట్లాడుతూ, భగత్ సింగ్ తన సహచరులు శివరామ్ రాజగురు, సుఖదేవ్ థాపర్లతో కలిసి ఆంగ్లేయుల విధానాలను నిరసిస్తూ పార్లమెంట్లో బాంబులు విసిరి ఎర్ర కరపత్రాలు చల్లారని తెలిపారు. పారిపోకుండా తన నిరసనను ధైర్యంగా తెలియజేసిన యోధుడని కొనియాడారు.
1931 మార్చి 23న బ్రిటిష్ ప్రభుత్వం భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్లకు ఉరిశిక్ష అమలు చేసిన విషయం గుర్తుచేశారు. మరణాన్ని చిరునవ్వుతో ఆహ్వానించి ఉరితాడును ముద్దాడిన వీరుడని అన్నారు. తన ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ ఎప్పుడూ క్షమాభిక్ష కోరలేదని పేర్కొన్నారు.
అలాంటి మహనీయుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని, కానీ నేటి పాలకులు ఆయన ఆశయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సమాన హక్కులు, స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తూ విభజన రాజకీయాలు కొనసాగించడం బాధాకరమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు దొంత కృష్ణ, గట్టు వెంకటేశ్వరరావు, బల్లవరపు శేఖర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.