చాట్రాయి అనుదీప్ మరణం పై ప్రత్యేక విచారణలో వేగం
చాట్రాయి అనుదీప్ మరణం పై ప్రత్యేక విచారణలో వేగం… రంగంలోకి దిగిన అధికారి రాజశేఖర్
చాట్రాయి, ఏప్రిల్ 4:
చాట్రాయి మండల కేంద్రంలో వివాదాస్పదంగా మారిన అంబటి అనుదీప్ మృతి కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. ఈ కేసు నిగ్గు తేల్చేందుకు నియమితులైన ప్రత్యేక విచారణ అధికారి రాజశేఖర్ శుక్రవారం రంగంలోకి దిగారు.
ముందుగా చాట్రాయికి చేరుకున్న ఆయన, అనుదీప్ మృతి చెందిన ప్రదేశాన్ని పరిశీలించి కీలక వివరాలను సేకరించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను కలుసుకుని, సంఘటన జరిగిన రోజు పరిస్థితులపై విచారణ జరిపారు.
అనుదీప్ మృతి ఆత్మహత్యా? లేక హత్యా? అనే అంశాన్ని సమగ్రంగా విచారించి త్వరలోనే నిజాలు వెలుగులోకి తీసుకువస్తామని రాజశేఖర్ తెలిపారు. ఈ దర్యాప్తుకు అందరూ సహకరించాలని ఆయన కోరారు.
ఈ కేసులో భాగంగా అనుదీప్ స్నేహితులతో పాటు ప్రియురాలు మరియు ఆమె కుటుంబ సభ్యులను కూడా విచారించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అలాగే చాట్రాయి పోలీస్ స్టేషన్కు వెళ్లిన విచారణ అధికారి, కేసుకు సంబంధించిన ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు.
ఇక ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారిని ఏలూరుకు పిలిపించగా, జనసేన నాయకులు తుమ్మల జగన్, పాశం నాగబాబు, తుమ్మల శంకర్ హాజరై తమ వాంగ్మూలాలు ఇచ్చారు. కేసు దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయాలని వారు కోరగా, జిల్లా ఎస్పీ నుండి ఇప్పటికే ఆదేశాలు ఉన్నాయని విచారణ అధికారి తెలిపినట్లు తుమ్మల జగన్ పేర్కొన్నారు.