చాట్రాయి మండలంలో అంగన్వాడీ టీచర్లతో విద్యాశాఖ సమావేశం
చాట్రాయి మండలంలో అంగన్వాడీ టీచర్లతో విద్యాశాఖ సమావేశం
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో అంగన్వాడీ కేంద్రాల్లో ఐదు సంవత్సరాలు దాటిన విద్యార్థులను తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. ఈ మేరకు మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఎంఈఓ కార్యాలయంలో మండలంలోని 75 అంగన్వాడీ కేంద్రాల టీచర్లు, సూపర్వైజర్లతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నూజివీడు డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి పి.ఎస్. సుధాకర్ హాజరై మాట్లాడారు. ప్రభుత్వం గర్భిణీ దశ నుంచి పిల్లలకు ఐదు సంవత్సరాలు వచ్చే వరకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారంతో పాటు విద్య అందిస్తోందన్నారు. అయితే మొదటి తరగతి చేరే సమయంలో తల్లిదండ్రులు పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించడం ఆందోళన కలిగించే విషయమన్నారు.
సౌకర్యాలు లేని ప్రైవేట్ పాఠశాలల్లో పిల్లలను చేర్పించి తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బందులు పడవద్దన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత పుస్తకాలు, యూనిఫాంలు, షూస్, రాత పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, బెల్ట్, డిక్షనరీ వంటి సౌకర్యాలతో పాటు “తల్లికి వందనం” పథకం ద్వారా రూ.15 వేల నగదు కూడా ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు.
అయినా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు ఉన్నప్పటికీ తల్లిదండ్రులు అప్పులు చేసి ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పిస్తున్నారని వాపోయారు. ప్రతి అంగన్వాడీ టీచర్ తమ పరిధిలోని ప్రతి విద్యార్థిని ప్రభుత్వ పాఠశాలలోనే చేర్చేలా కృషి చేయాలని సూచించారు.
ఎంఈఓ-1 మాసగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను కాపాడే బాధ్యత అందరిపై ఉందన్నారు. ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి చిన్నారిని సమీప ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి నాణ్యమైన విద్య అందేలా చూడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ గాయత్రి, అంగన్వాడీ టీచర్లు, మండల విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు.