చాట్రాయిలో సంచలనం… జనసైనికుడి మృతి పై ఉద్రిక్తత
చాట్రాయిలో సంచలనం… జనసైనికుడి మృతి పై ఉద్రిక్తత
చాట్రాయి గ్రామంలో అంబటి దీపు మృతి ఘటనపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హత్యగా ఆరోపణలు వెల్లువెత్తుతున్న ఈ ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని జనసేన నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనసేన పార్టీకి చెందిన నాయకులు మరీదు శివరామకృష్ణ, యర్రంశెట్టి రాము, ముమ్మలనేని సునీల్ కుమార్ తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ—కాపు సామాజిక వర్గానికి చెందిన జనసైనికుడు అంబటి దీపును హత్య చేశారని, నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనలో అసలు నిందితులను రక్షించే ప్రయత్నం జరుగుతోందని, హత్యను ఆత్మహత్యగా మలచాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. “ఎవరి ప్రోత్సాహంతో కేసును తారుమారు చేస్తున్నారు? ఎందుకు ఇప్పటివరకు అరెస్టులు జరగలేదు?” అంటూ ప్రశ్నించారు.
జనసేన పార్టీ నూజివీడు నియోజకవర్గం తరఫున బాధిత కుటుంబానికి పూర్తి మద్దతు ఉంటుందని, న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.
అలా జరగని పక్షంలో ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతామని, అవసరమైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసి సమస్యను పరిష్కరించే వరకు వెనక్కి తగ్గబోమని హెచ్చరించారు.
అంతేకాకుండా ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధిత కుటుంబం సూచిస్తున్న నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
“వ్యవస్థలు ఉన్నవారికి ఒకలా, లేనివారికి మరోలా పనిచేయడం బాధాకరం” అని మరీదు శివరామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.