చాట్రాయిమండలంలో ఏవో బి శివశంకర్ ఎల్నినో ప్రభావంపై రైతులకు అవగాహన కార్యక్రమం
చాట్రాయి: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని అన్ని గ్రామాల రైతు సేవా కేంద్రాల్లో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి ‘రైతన్న మీకోసం’ కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతు సేవా కేంద్రాల వ్యవసాయ సహాయక అధికారులు, పశుసంవర్ధక శాఖ అధికారులు, ఉద్యానవన శాఖ అధికారులు, నీటి వినియోగదారుల సంఘాల సభ్యులు, ప్రజాప్రతినిధులు రైతులకు ఎల్నినో ప్రభావంపై అవగాహన కల్పించారు.
ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. పంటల యాజమాన్య పద్ధతులు, నీటి వనరులను పొదుపుగా వినియోగించుకునే విధానం, బిందు సేద్యం ప్రయోజనాలు, ప్రకృతి వ్యవసాయం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.
ఖాళీగా ఉన్న భూములను ఏడాది పొడవునా పంటలు లేదా పచ్చిరొట్ట పంటలతో కప్పి ఉంచే విధానాన్ని రైతులు అవలంబించాలని సూచించారు. నవధాన్యాలు, ఆయిల్పామ్–మామిడి తోటల్లో నవధాన్యాలు, పప్పుధాన్యాల సాగు చేపట్టడం ద్వారా భూమి సారాన్ని కాపాడుకోవడంతో పాటు నీటి వినియోగాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు.
అనంతరం ఆరుగొలనుపేట గ్రామంలో రైతులతో అధికారులు చర్చించి, ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై సూచనలు అందించారు.