చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి
చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి : సిపిఐ ఎంఎల్ లిబరేషన్
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం చెక్కపల్లిలో భూదాన యజ్ఞ బోర్డు భూములను రీ సర్వేలో గుర్తించి ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ఏలూరు జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు డిమాండ్ చేశారు.
ఈ మేరకు పీజీఆర్ఎస్లో సబ్ కలెక్టర్ బుల్లిపల్లి వినూత్నకు అర్జీ సమర్పించారు. ఈ సందర్భంగా పుల్లారావు మాట్లాడుతూ, 1964 సంవత్సరంలో అంకుశరావు సుబ్బరాజు 23 ఎకరాల 12 సెంట్లు, అంకుశం వీర వెంకట రాఘవరావు 22 ఎకరాల 58 సెంట్లు, అంకుశరావు కృష్ణారావు 8 ఎకరాల 17 సెంట్లు, సావిత్రమ్మ 10 ఎకరాల 49 సెంట్లు, అంకుశరావు కొండలరావు 21 ఎకరాలు, అంకుశరావు తులసీ రత్నం 13 ఎకరాల 42 సెంట్లు, అంకుశం కృష్ణవేణి 21 ఎకరాల 82 సెంట్లు భూమిని భూదాన యజ్ఞ బోర్డుకు దానం చేశారని తెలిపారు.
ఈ భూములను 27-05-1976న గెజిట్ ప్రకటన ద్వారా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే, 1972లో కొందరికి, 1977లో మరికొందరికి మొత్తం 29 మందికి భూములు పంపిణీ చేసినట్లు కాగితాలపై చూపించినప్పటికీ, వాస్తవంగా లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వలేదని, భూములపై పొజిషన్ కూడా చూపించలేదని ఆరోపించారు.
దానం చేసిన వారే ప్రభుత్వం, భూదాన యజ్ఞ బోర్డును మోసం చేసి అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని తెలిపారు. ప్రస్తుతం ఆ భూములను వలస భూస్వాములు అనుభవిస్తున్నారని, భూమిలేని దళిత రైతులకు న్యాయం జరగలేదన్నారు.
భూదాన యజ్ఞ బోర్డు భూములను గుర్తించి పేదలకు పంచాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో తహశీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాల వద్ద అనేక ఆందోళనలు నిర్వహించినట్లు చెప్పారు. అప్పటి ముసునూరు తహశీల్దార్ శర్మ 2014లో భూదాన భూముల వివరాలు కోరుతూ లేఖ రాశారని తెలిపారు.
దానికి స్పందించిన భూదాన యజ్ఞ బోర్డు కార్యదర్శి, పూర్తి వివరాలు పంపిస్తూ రెవెన్యూ రికార్డుల్లో భూదాన భూములుగా అడంగల్, పహాణీలలో నమోదు చేయాలని కలెక్టర్, ఆర్డీవో, తహశీల్దార్లకు సూచించినప్పటికీ ఇప్పటివరకు అధికారులు చర్యలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం చెక్కపల్లిలో రీ సర్వే జరుగుతున్న నేపథ్యంలో భూదాన యజ్ఞ బోర్డు గెజిట్, దానపత్రాల ఆధారంగా భూములను గుర్తించి ప్రభుత్వం స్వాధీనం చేసుకుని భూమిలేని పేదలకు పంపిణీ చేయాలని పుల్లారావు డిమాండ్ చేశారు.