చింతలపూడి గ్రంథాలయాన్ని పరిశీలించిన జుత్తుక నాగరాజు
చింతలపూడి గ్రంథాలయాన్ని పరిశీలించిన జుత్తుక నాగరాజు
ఏలూరు జిల్లా చింతలపూడి గ్రంథాలయాన్ని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి జుత్తుక నాగరాజు సందర్శించారు.
ఈ సందర్భంగా గ్రంథాలయంలోని పుస్తకాల సంఖ్య, వివిధ అంశాలకు సంబంధించిన పుస్తకాల వివరాలను పరిశీలించారు. ఆధార పట్టికలు, స్టాక్ రిజిస్టర్ను పరిశీలించి గ్రంథాలయ నిర్వహణ తీరుపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు అవసరమైన పుస్తకాలు, స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని నాగరాజు తెలిపారు. ప్రత్యేక పుస్తకాలు లేదా అధ్యయన సామగ్రి అవసరమైతే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
చింతలపూడి గ్రంథాలయంలో త్వరలోనే డిజిటల్ గ్రంథాలయం ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. డిజిటల్ వనరుల ద్వారా విద్యార్థులకు మరింత మెరుగైన సమాచారాన్ని అందించడమే లక్ష్యమన్నారు.
గ్రంథాలయాన్ని విద్యార్థులు, పాఠకులకు మరింత ఉపయోగకరమైన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని జుత్తుక నాగరాజు పేర్కొన్నారు.