చిన్న నిర్లక్ష్యం.. చిన్నారికి జీవితాంతం బాధ! జూన్ 28న ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి: చాట్రాయి తహసీల్దార్ జి. శ్వేత
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో ఈ నెల 28న నిర్వహించే జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని తహసీల్దార్ జి. శ్వేత పిలుపునిచ్చారు.
0 నుంచి 5 సంవత్సరాల లోపు వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. పోలియో వంటి ప్రమాదకర వ్యాధిని పూర్తిగా అరికట్టాలంటే ప్రతి చిన్నారికి చుక్కలు వేయడం అత్యంత కీలకమని తెలిపారు.
"రెండు చుక్కలు... చిన్నారి జీవితానికి పెద్ద రక్షణ" అంటూ ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను సమీప పోలియో కేంద్రానికి తీసుకువచ్చి చుక్కలు వేయించాలని కోరారు. చిన్న నిర్లక్ష్యం పిల్లల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించారు.
పోలియో రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, అధికారులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బందితో పాటు ప్రజలు కూడా భాగస్వాములు కావాలని తహసీల్దార్ జి. శ్వేత పిలుపునిచ్చారు. పిల్లల ఆరోగ్యమే కుటుంబానికి, సమాజానికి నిజమైన సంపద అని పేర్కొన్నారు