చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. మాంసం నింపిన బొమ్మలతో కొత్త ఎత్తుగడ!
కాకినాడ జిల్లా పామాయిల్ తోటలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు పదో రోజుకు చేరినా ఫలితం లేకుండా కొనసాగుతున్నాయి. ఈ కేసును ఛేదించేందుకు అధికారులు ప్రత్యేక వ్యూహాలతో రంగంలోకి దిగారు.
వన్యమృగాల కదలికలను గుర్తించేందుకు ఘటన స్థలంలో ఇనుప బోనును ఏర్పాటు చేసి, అందులో చిన్నారిని పోలిన రెండు బొమ్మలను ఉంచారు. ఆ బొమ్మల్లో మాంసం ముక్కలు పెట్టి జంతువులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. సమీపంలో కెమెరా ట్రాప్లు ఏర్పాటు చేసి ప్రతి కదలికను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.
ఇక కేసులో మరో అనుమానాస్పద అంశం వెలుగులోకి వచ్చింది. పాపతో పాటు వెళ్లిన పెంపుడు కుక్క జూన్ 13న మృతి చెందింది. జూన్ 9న ఒంటరిగా ఇంటికి తిరిగి వచ్చిన ఈ కుక్క, ఆ తర్వాత ఆహారం తీసుకోకుండా వింత ప్రవర్తన చూపినట్లు సమాచారం. దీనికి జీపీఎస్ ట్రాకర్ అమర్చినా ఆచూకీ స్పష్టంగా లభించలేదు. సుమారు 80 కిలోమీటర్ల దూరం సంచరించిన తర్వాత అది ఇంటికి చేరినట్లు తెలుస్తోంది. వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగానే మృతి చెందినట్లు అనుమానం వ్యక్తమవుతోంది.
జూన్ 6న తుని మండలం సిహెచ్. అగ్రహారం ప్రాంతంలో తల్లిదండ్రులు గణేష్, భవాని తో కలిసి పామాయిల్ తోటకు వెళ్లిన సమయంలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైంది. తల్లిదండ్రుల మధ్య సమన్వయ లోపం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
చిన్నారి ఆచూకీ తెలిపిన వారికి జిల్లా యంత్రాంగం రూ. లక్ష రివార్డు ప్రకటించింది.