చిన్నంపేట, బూరుగుగూడెం గ్రామాల్లో డ్రైనేజ్ దుర్గంధం – ప్రజల ప్రాణాలతో చెలగాటమా? అధికారులు మౌనమా?
ఏలూరు జిల్లా: చాట్రాయి మండలం చిన్నంపేట, బూరుగుగూడెం గ్రామాలలో రోడ్డు పక్కన ఉన్న ఇళ్లు, షాపుల నుంచి వచ్చే డ్రైనేజ్ నీరు నేరుగా రోడ్డుపైకి వదులవడమే స్థానికులను నిత్యం ఇబ్బందుల్లో పెట్టుతోంది. ముఖ్య రహదారిపై మురుగు నీరు ప్రవహించటంతో, ప్రతి రోజు ప్రజలు, విద్యార్థులు, వృద్ధులు, ద్విచక్ర వాహనదారులు అవస్థలకు గురవుతున్నారు.
మురుగు నీటితో రోడ్డు బురదమయంగా మారి, దుర్వాసన వ్యాపిస్తోంది. వర్షం పడిన సందర్భంలో పరిస్థితి మరింత దారుణంగా మారి, "రోడు ఏది – డ్రైన్ ఏది" అనే అయోమయ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆవేదనతో పేర్కొన్నారు.
గ్రామస్తులు పలుమార్లు సంబంధిత అధికారులకు, గ్రామ పంచాయతీ సిబ్బందికి పంచాయతీ స్పెషల్ ఆఫీసర్లకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. ప్రజా ఆరోగ్యానికి ముప్పుగా మారిన సమస్యపై అధికారులు మౌనంగా ఉన్నారని వారు మండిపడుతున్నారు.
"వ్యాధులు ప్రబలితే బాధ్యత ఎవరిది?" అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. దోమలు, ఈగలు పెరుగుదలతో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నప్పటికీ అధికారుల స్పందన లేనందుకు తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
గ్రామంలోని రహదారిని మురుగు కాలువలా మార్చిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, రోడ్డు మీద వస్తున్న డ్రైనేజ్ నీటిని అరికట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తారా, లేక ప్రజల గోడును గాలికొడుస్తారా? అనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన సమయం ఇప్పుడు దగ్గరపడింది.