చిన్నంపేటలో చదువుల తల్లికి ఘన సన్మానం
చిన్నంపేట, జూన్ 8:
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చిన్నంపేట గ్రామానికి చెందిన అడ్డగట్ల కవిత, చిన్నంపేట జడ్పీహెచ్ హైస్కూల్లో పదో తరగతిలో మండల ప్రథమ స్థానం సాధించడంతో, ఈరోజు సోమవారం సిపిఐ అనుబంధ వ్యవసాయ కార్మిక సంఘం చాట్రాయి మండల కార్యదర్శి కొమ్ము ఆనందం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించబడింది.
ఈ సందర్భంగా టిడిపి ఎస్సీ సెల్ నాయకులు కొమ్ము సుజాన్ రావు మాట్లాడుతూ, “20 సంవత్సరాలు తలదించుకుని చదివితే 80 సంవత్సరాలు తల ఎత్తుకొని జీవించవచ్చు. కృషి, పట్టుదల ప్రతి విద్యార్థికి అవసరం. అలాంటి పట్టుదలతో చదివి చిన్నంపేటకు ఆదర్శంగా నిలిచిన కవితా రాణి, జీవితంలో ముందుకు వెళ్లి ఉన్నత చదువులు అభ్యసించి చరిత్రను తిరగరాయాలని కోరుతున్నాం,” అని అభిప్రాయం తెలిపారు. ఈ సందర్భంలో ఆమెకు 2,000 రూపాయల బహుమతి అందజేశారు.
అందులోనే బుడుపుల రామకృష్ణ మాట్లాడుతూ, చిన్న వయసులో తండ్రిని కోల్పోయి తల్లి కష్టార్జితాన్ని గుర్తించిన కవిత, ఎంతో కష్టపడి చదివినందుకు భవిష్యత్తులో మంచి అవకాశాలు పొందుతుందని తెలిపారు. “నేను చిన్నప్పుడే తల్లిని కోల్పోయా, అయినా కృషి, పట్టుదల, ధైర్యంతో చదివి పదిమందికి సహాయపడుతున్నాను. దేవుడు నాకు మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు. నువ్వు కూడా చదివి ముందుకు వచ్చి, సొంత లాభంలో కొంత మానుకుని పొరుగు వారికి సాయపడాలి,” అని కవితకు ఉపదేశం ఇచ్చారు. అనంతరం కవితకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు అడ్డగట్ల సతీష్ భాను మాస్టర్, చిన్నంపేట మహిళా టైలర్స్ యూనియన్ నాయకులు తాటిచెర్ల సుబ్బలక్ష్మి, అడ్డగట్ల సుధారాణి, మరియు పరస చెన్నమ్మ సహా గ్రామస్తులు పాల్గొని కవితను ఆశీర్వదించారు.