చిట్యాల సమీపంలో లారీ క్లీనర్ మృతి
నల్గొండ జిల్లా చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని నేషనల్ హైవే 65 పక్కన ఉన్న '7 హోటల్' సమీపంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. చిట్యాల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడిని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోకు చెందిన లారీ క్లీనర్ లకేంద్ర (33)గా గుర్తించారు. వారం రోజుల క్రితం పని కోసం బయలుదేరిన లకేంద్ర గత రెండు రోజులుగా కుటుంబ సభ్యులకు అందుబాటులోకి రాలేదు. దీంతో అతని కోసం వెతుకుతూ బుధవారం (26-06-2024) చిట్యాలకు వచ్చిన బంధువులకు, హోటల్ సమీపంలో లకేంద్ర మృతదేహం కనిపించింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అతను, సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం మరియు ఎండ తీవ్రతకు వడదెబ్బ తగలడం వల్లే మరణించి ఉంటాడని బంధువులు తెలిపారు. మృతిపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని పేర్కొన్నారు. మృతుడి మేనబావ దిలీప్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిట్యాల ఎస్ఐ ఎం. రవికుమార్ తెలిపారు.