విద్యా, వైద్య రంగాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయంబి : మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించిన గుత్తా, ఎంపీ చామల, ఎమ్మెల్యే వీరేశం
రాష్ట్రంలో విద్యా, వైద్య రంగాలలో ప్రజలకు విస్తృతమైన సేవలను అందించడానికి ప్రభుత్వం కంకణబద్ధులై ఉందని తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో శనివారం ఆయన స్థానిక భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉరుమడ్లలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ కేంద్ర భవనాన్ని ప్రారంభించడంతో పాటు, యువత విజ్ఞానార్జన కోసం మరమ్మతులు పూర్తి చేసిన గ్రంథాలయ భవనాన్ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉరుమడ్ల గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామని భరోసా ఇచ్చారు. గ్రామంలో ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న వివిధ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయించి, త్వరలోనే రాష్ట్ర మంత్రుల చేతుల మీదుగా వాటిని ప్రారంభోత్సవం చేయిస్తామని ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో అర్హులైన, నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తల్లిదండ్రులు సహకరించాలని, తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
* ఉచిత కంటి శిబిరం ప్రారంభం
గుత్తా సుఖేందర్ రెడ్డి తన స్వగృహంలో శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర చికిత్స శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం కళ్ళు అని, వాటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఉరుమడ్ల గ్రామ ప్రజల కోసం శంకర నేత్రాలయం వారు అన్ని రకాల అత్యాధునిక వసతులు, శస్త్రచికిత్స ఏర్పాట్లతో ఇక్కడికి వచ్చారని తెలిపారు. తొమ్మిది రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగే ఈ ఉచిత వైద్య శిబిరాన్ని గ్రామస్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ శాఖ చైర్మన్ హఫీస్ ఖాన్, మున్సిపల్ చైర్పర్సన్ పందిరి గీతా రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్ర వినోద మోహన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు పోకల దేవదాస్, వనమా వెంకటేశ్వర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.