చిట్యాల టీటీడీ కళ్యాణ మండపం భూమిని కాపాడండి
చిట్యాల టీటీడీ కళ్యాణ మండపం భూమిని కాపాడండి
సర్వే నంబర్ 649 భూమిపై బీఆర్ఎస్ పోరు
కళ్యాణ మండపం భూమి మార్పిడి యత్నాలపై ఆగ్రహం
నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలోని సర్వే నంబర్ 649లో కళ్యాణ మండపం నిర్మాణం కోసం కొనుగోలు చేసిన ఎకరం 12 గుంటల భూమిని సేల్ అగ్రిమెంట్ ప్రకారమే తక్షణమే మున్సిపాలిటీ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం ప్రతిపాదిత కళ్యాణ మండపం స్థలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకుడు బొబ్బల శివశంకర్ రెడ్డి మాట్లాడుతూ చిట్యాల పట్టణ ప్రజల శాశ్వత అవసరాల కోసం కళ్యాణ మండపం నిర్మించాలనే తపనతో 2002వ సంవత్సరంలోనే గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, దాతలు కలిసి విరాళాల ద్వారా నిధుల సేకరణ చేపట్టారని తెలిపారు. ఈ క్రమంలో సర్వే నంబర్ 649లోని ఎకరం 12 గుంటల భూమిని రూ.2.50 లక్షలకు విక్రయించేందుకు భూ యజమానులు అంగీకరించి సేల్ అగ్రిమెంట్ కూడా చేసుకున్నారని స్పష్టం చేశారు. భువనగిరి రోడ్డు ముఖద్వారంగా 129 అడుగుల వెడల్పు ఉన్న ఈ విలువైన స్థలంలోనే కళ్యాణ మండపం నిర్మించాలని అప్పట్లోనే నిర్ణయించారని గుర్తుచేశారు.
ఈ నిర్మాణానికి సంబంధించి అప్పటి నల్గొండ ఎమ్మెల్యే, ప్రస్తుత రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులకు లేఖ రాయగా, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు సహకారం అందిస్తూ వచ్చారని పేర్కొన్నారు పలు సాంకేతిక కారణాల వల్ల భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆలస్యమైందని, అయితే ఇటీవల భూ యజమానులు తాము గతంలో అగ్రిమెంట్ చేసిన భూమినే మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వినతిపత్రం కూడా అందజేశారని శివశంకర్ రెడ్డి తెలిపారు. కానీ, సేల్ అగ్రిమెంట్లో పేర్కొన్న ప్రధాన స్థలానికి బదులుగా, వెనుక వైపు ఉన్న భూమిని కేటాయించేలా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారంలో కొంతమంది రాజకీయ నాయకులు జోక్యం చేసుకుంటూ, భూ యజమానులతో విరుద్ధమైన ప్రకటనలు చేయిస్తున్నారని విమర్శించారు. రోడ్డుపై ఉన్న ప్రధాన స్థలాన్ని ఆక్రమించి తన స్వలాభం కోసం వాడుకునేందుకే రాజకీయ నాయకుడు ఈ రకమైన ప్రణాళికలు అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు.ప్రజల చందాలతో కొనుగోలు చేసిన అసలు భూమినే అగ్రిమెంట్ ప్రకారం మున్సిపాలిటీ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని వారు డిమాండ్ చేశారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని కళ్యాణ మండపంతో పాటు ప్రభుత్వ కళాశాలలు లేదా ఇతర ప్రజాప్రయోజన సంస్థల నిర్మాణానికి ఈ స్థలాన్ని వినియోగించాలని కోరారు.
ఈ అంశంపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంలను అఖిలపక్ష నాయకులతో కలసి విన్నవిస్తామని, ప్రజా ఆస్తి అన్యాక్రాంతం కాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. అనంతరం టిటిడి కళ్యాణ మండప కోసం కేటాయించిన భూమిని కాపాడాలని స్థానిక మున్సిపల్ కమిషనర్ కు, సబ్ ఇన్స్పెక్టర్ కు , తహసిల్దార్ వారి వ కార్యాలయాల్లో వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు