హైదరాబాద్లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
హైదరాబాద్: మాదాపూర్లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై కేంద్ర మంత్రితో సీఎం చర్చించారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ (PMAY-G) పథకం కింద తొలి విడతగా తెలంగాణకు 2 లక్షల ఇళ్లను కేటాయించినందుకు కేంద్ర మంత్రికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. గత జూలైలో ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి రాష్ట్రంలోని 11,56,915 అర్హ గ్రామీణ కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేయాలని వినతిపత్రం సమర్పించిన విషయాన్ని గుర్తుచేశారు.
రాష్ట్ర డిమాండ్కు అనుగుణంగా మిగిలిన 9.56 లక్షల ఇళ్లను కూడా కేటాయించాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను కూడా సీఎం వివరించారు. వర్షాభావం కారణంగా వ్యవసాయ రంగంలో విద్యుత్ వినియోగం పెరిగిందని తెలిపారు. తాగునీరు, విద్యుత్ కొరత తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసిందని వివరించారు.
ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు కేంద్రం నుంచి అవసరమైన సహకారం అందించాలని సీఎం కోరారు. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. పంట మార్పిడిపై రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ కేంద్ర సహకారం కోరారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పేదలకు రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం అందిస్తున్నామని సీఎం వివరించారు. సన్న వడ్ల సాగును ప్రోత్సహించేందుకు రైతులకు క్వింటాల్కు రూ.500 బోనస్ అందిస్తున్నామని తెలిపారు.
అలాగే 250 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్రూట్స్, వెజిటెబుల్ మార్కెట్ను ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర మంత్రికి వివరించారు.
ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.