
సంక్రాంతి పండుగ కానుకగా ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ
పునర్వ్యవస్థీకరణపై ఉన్నత స్థాయి కమిషన్ నియామకం: సీఎం రేవంత్ రెడ్డి
NTODAY NEWS: హైదరాబాద్
మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై వస్తున్న డిమాండ్లను సమగ్రంగా అధ్యయనం చేసేందుకు సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిషన్ను నియమిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
ఈ సందర్భంగా సంక్రాంతి పండుగ కానుకగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదలకు సంబంధించిన ఫైలుపై సంతకం చేసినట్లు తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ రూపొందించిన 2026 డైరీ, క్యాలెండర్ను సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
మండలాలు, జిల్లాల సరిహద్దుల మార్పుపై వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న డిమాండ్లను కమిషన్ క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజాభిప్రాయాలు సేకరిస్తుందని తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన తరహాలో అధ్యయనం చేసి నివేదికను శాసనసభ ముందు ఉంచి చర్చించిన అనంతరం రేషనలైజేషన్పై మార్గదర్శకాలు విడుదల చేస్తామని వెల్లడించారు.
ఉద్యోగుల బెనిఫిట్స్కు సంబంధించి రూ.11 వేల కోట్ల బకాయిలు, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన రూ.40 వేల కోట్ల బకాయిలు, సింగరేణి, విద్యుత్ సంస్థల బకాయిలతో కలిపి మొత్తం రూ.1.11 లక్షల కోట్ల బకాయిలు ఉన్నాయని తెలిపారు. బ్యాంకు రుణాలతో కలిపి ప్రభుత్వంపై మొత్తం రూ.8.11 లక్షల కోట్ల అప్పుల భారం ఉందని పేర్కొన్నారు.
ఈ పరిస్థితుల్లోనూ ఉద్యోగులకు డీఏ మంజూరు చేస్తున్నామని తెలిపారు. డీఏ వల్ల ప్రభుత్వంపై ప్రతి నెలా సుమారు రూ.225 కోట్ల భారం పడుతుందని చెప్పారు. ఉద్యోగులే ప్రభుత్వానికి బలం అని, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేసే వారధులు ఉద్యోగులేనని అన్నారు. గత ప్రభుత్వంలో జీతాలు ఆలస్యమయ్యేవని, ప్రస్తుతం జీతాలు సమయానికి అందుతున్నాయో లేదో ఉద్యోగులు ఆలోచించాలని వ్యాఖ్యానించారు.
రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఆరోగ్య భద్రత, సంఘం కార్యాలయాల నిర్మాణంపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. సంఘం కార్యాలయాల నిర్మాణానికి ఉద్యోగులు చెల్లించే మొత్తానికి సమానంగా మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో గెజిటెడ్ అధికారుల కార్యాలయానికి స్థలం కేటాయిస్తామని వెల్లడించారు.
ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి రూ.1 కోటి ప్రమాద బీమా సౌకర్యంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పదవీ విరమణ వయసు పెంపు కారణంగా ప్రతి నెలా సుమారు వెయ్యి మంది రిటైర్ అవుతున్నారని, వారి బెనిఫిట్స్ను క్రమంగా చెల్లిస్తున్నామని చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ చెల్లింపులను మరింత పెంచుతామని తెలిపారు.
ప్రభుత్వం–ఉద్యోగులు వేర్వేరు కాదని, ప్రభుత్వంపై సంపూర్ణ విశ్వాసం ఉంచాలని సీఎం కోరారు. కొత్త పన్నులు పెంచడం లేదని, పన్నుల లోసుగులను సరిదిద్దడం ద్వారా ఆదాయం పెంచి సంక్షేమ పథకాలు, ఉద్యోగుల జీతాలు, బెనిఫిట్స్ సమయానికి చెల్లిస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
#DAForEmployees
#SankrantiGift
#TelanganaGovernment
#GovernmentEmployees
#MunicipalReforms
#PublicAdministration
#EmployeeWelfare
#NtodayNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube