డాడీ అని పిలిచాడని బాలుడిని ఇంటికి తీసుకెళ్లిన వ్యక్తి.. 12 రోజుల తర్వాత పోలీస్ స్టేషన్లో అప్పగింపు
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉప్పల్ చిలకనగర్కు చెందిన రాజేశ్వరి తన ఐదేళ్ల కుమారుడు నిఖిల్తో కలిసి విజయవాడ వెళ్లేందుకు తన తల్లితో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళ్లింది. ఈ క్రమంలో నిఖిల్ అమ్మమ్మకు చెప్పకుండా బయటకు వెళ్లిపోయాడు.
అక్కడ చింతల్ రాంనగర్ ప్రాంతానికి చెందిన, ఏపీ రాజోలు వాసి షేక్ అహ్మద్ అలీని బాలుడు "డాడీ" అని పిలిచాడు. తన భార్య పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోవడంతో మానసికంగా ఒంటరిగా ఉన్న షేక్ అహ్మద్ అలీ, బాలుడిని తనతో తీసుకెళ్లి పెంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
అతడు నిఖిల్ను తన ఇంటికి తీసుకెళ్లి 12 రోజుల పాటు దాచిపెట్టాడు. అయితే బాలుడి అదృశ్యంపై మీడియాలో, సోషల్ మీడియాలో కిడ్నాప్ వార్తలు విస్తృతంగా రావడంతో భయపడిన నిందితుడు, బాలుడిని జీడిమెట్ల పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చాడు.
పోలీసుల ఎదుట బాలుడికి జ్వరం రావడంతో ఇంటికి తీసుకెళ్లి వైద్యం చేశానని చెప్పి నమ్మించే ప్రయత్నం చేసినా, విచారణలో అసలు విషయం బయటపడింది. దీంతో షేక్ అహ్మద్ అలీపై కేసు నమోదు చేసిన పోలీసులు, బాలుడు నిఖిల్ను అతని తల్లికి అప్పగించారు.