దేశ రాజకీయాలను కదిలించిన మహానేత డాక్టర్ బాబు జగజీవన్ రామ్
దేశ రాజకీయాలను కదిలించిన మహానేత డాక్టర్ బాబు జగజీవన్ రామ్
దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసి, సమానత్వానికి ప్రతీకగా నిలిచిన మహానేత డాక్టర్ బాబు జగజీవన్ రామ్ అని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు అన్నారు. దేశ నిర్మాణంలో ఆయన చేసిన సేవలు అపారమని, ఆయన చూపిన మార్గం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఆదివారం చాట్రాయి చిన్నపేటలో ఎంఆర్పీఎస్ మరియు చిన్నపేట యూత్ ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా, ఉత్సాహభరితంగా నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభంలో మాజీ సర్పంచ్ కోట జోషి ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరించగా, మండల అధ్యక్షుడు ములుగుమాటి రవిరామ్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా దుర్గం పుల్లారావు మాట్లాడుతూ—
సామాజిక అసమానతలపై గళమెత్తి, సమాన హక్కుల కోసం నిరంతరం పోరాడిన గొప్ప నాయకుడు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ అని కొనియాడారు. చిన్ననాటి నుంచే వివక్షను ఎదుర్కొంటూ ఎదిగి, తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేశారని గుర్తుచేశారు.
1908లో బీహార్ రాష్ట్రంలోని సహనాబాద్ జిల్లా చాందు గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆయన, కష్టాల మధ్య చదువుకుని దేశ రాజకీయాల్లో కీలక స్థానాన్ని సంపాదించారని తెలిపారు. చదువుకునే దశలోనే సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు కృషి చేసిన ఆయన, ప్రజల్లో అవగాహన కల్పించడంలో ముందుండారని పేర్కొన్నారు.
స్వాతంత్ర్యం అనంతరం దేశానికి తొలి కార్మిక మంత్రిగా బాధ్యతలు చేపట్టి అనేక సంస్కరణలు తీసుకువచ్చారని, కమ్యూనికేషన్, రైల్వే, రవాణా, వ్యవసాయం, రక్షణ వంటి కీలక శాఖల్లో సేవలందించి దేశ అభివృద్ధికి బలమైన పునాదులు వేశారని అన్నారు. 1977 నుండి 1979 వరకు ఉప ప్రధానిగా పనిచేసి తన నాయకత్వాన్ని చాటుకున్నారని తెలిపారు.
అనంతరం కొమ్ము సుజన్ రావు కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో కొప్పుల ప్రసాద్, విస్సంపల్లి బాలు, కోపూరి రాజు, దుర్గం జీవరత్నం, ఆడిమిల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.