దెయ్యాలకుంటపల్లి సర్పంచ్పై అవినీతి ఆరోపణలు – విచారణ కోరుతూ ఫిర్యాదు
దెయ్యాలకుంటపల్లి సర్పంచ్పై అవినీతి ఆరోపణలు – విచారణ కోరుతూ ఫిర్యాదు
విజయవాడ, మార్చి 23: దెయ్యాలకుంటపల్లి గ్రామ సర్పంచ్ సద్దా రమేష్పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. గ్రామ టిడిపి నాయకుడు పెద్దప్ప, ఎంపీడీవో సాల్మన్ రాజుకు గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం… సర్పంచ్ రమేష్ తన బావమరిది చరణ్ సాయి, ఎంపీటీసీ శివారెడ్డి పేర్లతో పంచాయతీ నిధులను అక్రమంగా డ్రా చేసినట్లు ఆరోపించారు. గ్రామ అభివృద్ధి పనుల కోసం విడుదలైన నిధులను దుర్వినియోగం చేశారని తెలిపారు.
చరణ్ సాయి విజయవాడలో ఉన్నప్పటికీ, అతని ఖాతాకు అభివృద్ధి పనుల పేరుతో నిధులు బదిలీ చేసినట్లు పేర్కొన్నారు. పైపులైన్లు వేయకపోయినా వేసినట్లు, కాలువలు శుభ్రం చేయకపోయినా చేసినట్లు చూపించి భారీగా నిధులు డ్రా చేసినట్లు ఆరోపించారు.
అలాగే, స్వచ్ఛ భారత్ షెడ్డు గత టిడిపి ప్రభుత్వ కాలంలో నిర్మించబడినప్పటికీ, మరమ్మత్తులు చేసినట్లు చూపించి ఎంపీటీసీ శివారెడ్డి పేరుతో నిధులు తీసుకున్నారని తెలిపారు. మొత్తం మీద సుమారు రూ.15 లక్షలకు పైగా పంచాయతీ నిధులు అక్రమంగా మళ్లించారని ఆరోపించారు.
ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పెద్దప్ప డిమాండ్ చేశారు.