దొండపూడి 'నిత్య పెళ్లికూతురు' అరెస్ట్.. ఐదు పెళ్లిళ్లు చేసి పలువురికి టోకరా!
పశ్చిమగోదావరి జిల్లా దొండపూడికి చెందిన వజ్రపు మణి అలియాస్ శ్వేతారెడ్డి అలియాస్ కీర్తి (27)ను అనంతపురం జిల్లా పెద్దవడుగూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకరికి తెలియకుండా మరొకరిని వివాహం చేసుకుంటూ పలువురిని మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం, విజయవాడకు చెందిన కొందరు మధ్యవర్తులతో కలిసి ఎదురుకట్నం వచ్చేలా పెళ్లి సంబంధాలు కుదుర్చుకుని, వివాహం అనంతరం కొద్ది రోజులే భర్త వద్ద ఉండి స్వస్థలానికి వెళ్లిపోయేదని వెల్లడించారు. ఇదే తరహాలో మొత్తం ఐదు వివాహాలు చేసినట్లు విచారణలో తేలినట్లు సమాచారం.
2025లో పెద్దవడుగూరు మండలం కాసేపల్లికి చెందిన యాపర్ల సుధీర్రెడ్డిని వివాహం చేసుకున్న ఆమె, కొద్దిరోజులకే చెప్పకుండా వెళ్లిపోవడంతో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
ఇటీవల కర్ణాటకలోని మల్లెకుప్పానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుని ఆరు రోజులకే మదనపల్లె వెళ్తుండగా చీలకబైలు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసులో మరిన్ని వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.