www.ntodaynews.com
Drainage Issue: జనార్ధనవరం ఎస్సీ కాలనీలో తీవ్ర డ్రైనేజీ సమస్య.. నిల్వ నీటితో ప్రజల అవస్థలు
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లా, చాట్రాయి మండలం, జనార్ధనవరం | NTODAY NEWS
ఏలూరు జిల్లా చాట్రాయి మండలం జనార్ధనవరం గ్రామంలోని ఎస్సీ కాలనీ మాలపల్లిలో డ్రైనేజీ సమస్య తీవ్రరూపం దాల్చింది. డ్రైనేజీలోకి వర్షపు నీరు వెళ్లకుండా దిగువ ప్రాంతంలోని కొంతమంది రైతులు అడ్డుకట్ట వేయడంతో వర్షపు నీరు సిమెంట్ రోడ్డుపై నిలిచిపోయి కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రోడ్డుపై నిల్వ ఉన్న నీటి కారణంగా ఇళ్లలోకి వెళ్లాలంటే బురదలో నుంచి నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే మార్గంలో ప్రతిరోజూ సుమారు 20 మంది విద్యార్థులు పాఠశాలకు వెళ్లాల్సి వస్తోందని, వారు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
వర్షాకాలం నేపథ్యంలో నిల్వ నీటితో దోమలు విపరీతంగా పెరిగి జ్వరాలు విజృంభిస్తున్నాయని, ఇప్పటికే కొంతమంది అనారోగ్యానికి గురయ్యారని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమస్యపై పంచాయతీ కార్యదర్శిని సంప్రదించగా, ప్రస్తుతం ఎన్నికల విధుల్లో ఉన్న కారణంగా వెంటనే చర్యలు తీసుకోవడం సాధ్యం కాదని చెప్పినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.
తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, కాలనీలో నిల్వ ఉన్న నీటిని తొలగించి ప్రజలను అంటువ్యాధుల బారిన పడకుండా చర్యలు చేపట్టాలని జనార్ధనవరం మాలపల్లి వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.