డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ జయరావు
ప్రకాశం జిల్లా రాచర్లలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలో డ్రగ్స్పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎం. జయరావు పాల్గొని విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు.
మత్తు పదార్థాల వినియోగం వ్యక్తిగత జీవితానికే కాకుండా కుటుంబాలు, సమాజంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన తెలిపారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, చెడు అలవాట్లు మరియు చెడు స్నేహాల బారిన పడకుండా విద్యార్థులు తమ భవిష్యత్తుపై దృష్టి సారించాలని సూచించారు.
ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం మత్తు పదార్థాల నిల్వ, రవాణా, విక్రయాలు వంటి నేరాలకు కఠినమైన శిక్షలు ఉంటాయని జయరావు వివరించారు. ఎక్కడైనా మాదకద్రవ్యాలకు సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు.
కార్యక్రమం అనంతరం విద్యార్థులు డ్రగ్స్ వ్యతిరేక అవగాహన ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. "సే నో టు డ్రగ్స్", "డ్రగ్ ఫ్రీ సొసైటీ", "యూత్ ఎగైనెస్ట్ డ్రగ్స్" వంటి నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రజల్లో చైతన్యం కల్పించారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు తమ వంతు బాధ్యత నిర్వర్తిస్తామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ కె.వి. జాన్సన్, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, ఎక్సైజ్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.