దశలవారీగా గొల్లపల్లి మండల కేంద్ర సమస్యల పరిష్కారం
దశలవారీగా గొల్లపల్లి మండల కేంద్ర సమస్యల పరిష్కారం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
గొల్లపల్లి, ఏప్రిల్ 1: గొల్లపల్లి మండల కేంద్రంలోని సమస్యలను దశలవారీగా పరిష్కరించి, ప్రజలకు మెరుగైన వసతులు కల్పిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. బుధవారం గొల్లపల్లి మండల కేంద్రంలోని నల్లగుట్ట ప్రాంత ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన నూతన రేషన్ స్టాక్ పాయింట్ను మంత్రి ప్రారంభించారు.
మాట నిలబెట్టుకున్నాం: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నల్లగుట్టలో నూతన రేషన్ షాప్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని, త్వరలోనే బయోమెట్రిక్ విధానం ద్వారా పూర్తిస్థాయి రేషన్ దుకాణాన్ని అందుబాటులోకి తెస్తామని మంత్రి స్పష్టం చేశారు.
పేదల సంక్షేమమే ధ్యేయం: ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి ఆలోచన మేరకు పేద ప్రజలందరికీ నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని ఆయన తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందజేస్తామని భరోసా ఇచ్చారు.
అభివృద్ధి పనులపై హామీలు:
మండల కేంద్రం అభివృద్ధికి సంబంధించి మంత్రి పలు కీలక ప్రకటనలు చేశారు:
క్రీడారంగం: యువత కోసం గొల్లపల్లిలో నూతనంగా స్టేడియం నిర్మాణం చేపడతామని తెలిపారు.
మౌలిక సదుపాయాలు: పెండింగ్లో ఉన్న స్మశాన వాటిక రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
సుందరీకరణ: మండల కేంద్రంలో నిలిచిపోయిన సెంట్రల్ లైటింగ్ పనులను పునరుద్ధరించి పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
ప్రజల కష్టాలు తెలుసుకోని, ప్రతి సమస్యనూ పరిష్కరించడమే మా ప్రభుత్వ లక్ష్యం. గొల్లపల్లి రూపురేఖలు మార్చేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తాం
— అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మంత్రి