దుమ్ముగూడెంలో పశువుల అక్రమ రవాణా భగ్నం.. ముగ్గురు అరెస్ట్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం ములకపాడు కూడలి వద్ద పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో పశువుల అక్రమ రవాణా వ్యవహారం వెలుగుచూసింది. గురువారం తనిఖీలు చేపట్టిన పోలీసులకు నంబర్ప్లేట్ లేని ఓ వాహనం అనుమానాస్పదంగా కనిపించడంతో ఆపి తనిఖీ చేశారు.
వాహనంలో 12 పశువులను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. చర్ల ప్రాంతం నుంచి పండితాపురం వైపు పశువులను తీసుకెళ్తున్నట్లు విచారణలో తేలింది. వెంటనే పశువులను స్వాధీనం చేసుకుని వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు, ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.
ఈ కేసులో పాల్వంచకు చెందిన షేక్ కాశీం, షేక్ హన్ను, వాహన డ్రైవర్ వంశీలను అరెస్ట్ చేసినట్లు ఎస్సై శ్యాంప్రసాద్ వెల్లడించారు. పశువుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నామని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.