తెలంగాణ రాష్ట్రంలో మూడో విడత రైతు భరోసా నిధులు విడుదల.. 6.39 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రైతులకు మరో శుభవార్త అందించింది. రైతు భరోసా పథకం కింద మూడో విడత ఆర్థిక సాయాన్ని విడుదల చేసింది. 3 నుంచి 4 ఎకరాల భూమి కలిగిన రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.1,330 కోట్లను జమ చేసినట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
ఈ విడతలో రాష్ట్రవ్యాప్తంగా 6.39 లక్షల మంది రైతులు లబ్ధి పొందినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటివరకు రైతు భరోసా పథకం ద్వారా మొత్తం 61.35 లక్షల మంది రైతులకు రూ.5,402.37 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించినట్లు పేర్కొన్నారు.
వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం, సాగు ఖర్చులను తగ్గించడం, రైతులకు ఆర్థిక భరోసా కల్పించడమే రైతు భరోసా పథకం ప్రధాన లక్ష్యమని మంత్రి వివరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే నిధులు జమ చేస్తున్నట్లు చెప్పారు.
రైతు సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటున్న ప్రభుత్వం, వ్యవసాయాభివృద్ధి కోసం మరిన్ని సంక్షేమ చర్యలను అమలు చేస్తూ ముందుకు సాగుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.