ద్వారకా తిరుమల దేవస్థానంలో నకిలీ టికెట్ల వ్యవహారం
ద్వారకా తిరుమల దేవస్థానంలో నకిలీ టికెట్ల వ్యవహారం – కీలక నిందితుల అరెస్టు
కేసు నెంబర్: Cr.No.71/2026 U/s 316(5), 318(3), 336(3), 340(2) r/w 3(5) B.N.S & Sec 66, 66(D) IT Act – ద్వారకాతిరుమల PS
2026 మార్చి 15న, మధ్యాహ్నం 12:00 గంటల సమయంలో ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నకిలీ టికెట్లు భక్తులకు విక్రయించబడిన విషయం తెలిసిందే. రూ.200 విలువ గల 61 నకిలీ టికెట్లు స్వాధీనం చేసుకున్నట్లు దేవస్థానం ఈవో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ద్వారకాతిరుమల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయబడింది.
ప్రారంభ దర్యాప్తులో, దేవస్థానం టికెట్ కౌంటర్లో పనిచేసే సాయి జగన్నాథ రాజు మరియు సెక్యూరిటీ గార్డు మేక సతీష్లపై కేసు నమోదు చేయబడింది. అయితే, ప్రధాన నిందితుడు సాయి జగన్నాథ రాజు పరారీలో ఉండటంతో, భీమడోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. కృష్ణ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగింది.
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, సాయి జగన్నాథ రాజును, ములగాల రమేష్తో కలిసి నకిలీ టికెట్ల సాఫ్ట్వేర్ తయారుచేసి వాటిని ప్రింట్ చేసి భక్తులకు విక్రయించినట్లు తెలుసుకున్నారు. ఈ వ్యవహారంలో ఇతర ఔట్సోర్సింగ్ సిబ్బంది మరియు సెక్యూరిటీ సిబ్బంది కూడా పాల్గొన్నట్లు గుర్తించారు.
ఈ కేసులో, 7 కీలక నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. ఇప్పటికే, సముద్రాల శేషుబాబు, మేక సతీష్లను అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. నిందితుల వద్ద నుంచి నకిలీ టికెట్లు ముద్రించడానికి ఉపయోగించిన Dell ల్యాప్టాప్, TVS థర్మల్ ప్రింటర్, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ప్రభుత్వ అధికారులు, మరిన్ని నిందితులు ఉన్నట్లయితే వారిపై కూడా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.